AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాకిస్థాన్ లో 100 ఏళ్ల చరిత్ర ఉన్న హిందూ దేవాలయం కూల్చివేత..

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలం నాటి చరిత్ర కలిగిన ఒక హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నరోవల్ నగరం పరిధిలోని సిరాజ్ గ్రామంలో ఆగస్టు 21న ఈ సంఘటన చోటుచేసుకుంది. సమీపంలోని ఒక ఇస్లామిక్ సెమినరీ (మదర్సా) విస్తరణ కోసమే ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని మైనారిటీ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కొందరు వ్యక్తుల పథకం ప్రకారం ఈ ఆలయ నిర్మాణాన్ని కూల్చివేశారని ఆ పార్టీ చైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా ఆరోపించారు. గతంలో ఆలయం సమీపంలోని భూమిని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) సదరు మదర్సాకు లీజుకు ఇచ్చింది. అయితే, అద్దె చెల్లించకపోవడంతో ఆ లీజును రద్దు చేశారు. అయినప్పటికీ, ఆలయ స్థలంలోని కొంత భాగాన్ని కొందరు ఆక్రమించుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరిలోనే ఆక్రమణదారులను ఖాళీ చేయించి, సదరు ఆస్తిని సీల్ చేయాలని ఈటీపీబీ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అవి అమలు కాలేదని పీఎంఎంపీ విమర్శించింది. ఈ ఘటనపై ఆగస్టు 28న స్థానికులతో కలిసి పంజాబ్ అదనపు హోమ్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆలయ కూల్చివేతకు బాధ్యులైన వారిపై, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ధ్వంసం చేసిన ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని, దేశంలోని దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలకు సరైన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవల జూన్‌ నెలలో ఫరూఖాబాద్‌లోని 125 ఏళ్ల పురాతన గురుద్వారాను కూడా ఇదే తరహాలో కూల్చివేసిన ఘటనను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాల పరిరక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10