AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దం.. విపక్షాలకు మంత్రి అడ్లూరి ఓపెన్ ఛాలెంజ్!

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు గురుకుల విద్యాసంస్థల టెండర్ల వివాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

 

ఆరోపణల్లో క్లారిటీ లేదు.. అంతా అబద్ధాల ప్రచారం

 

గురుకుల విద్యాసంస్థల వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. ప్రజలను కేవలం తప్పుదోవ పట్టించడానికే ఈ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే అంశంపై బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అంకెలు చెబుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.

 

మూడు రకాల అంకెలు.. ఏది నిజం?

 

ఈ టెండర్ల వ్యవహారంలో ప్రతిపక్షాలు చెప్తున్న లెక్కల్లోనే పొంతన లేదని మంత్రి ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఏమో రూ.2 వేల కోట్ల కుంభకోణం అని అంటుంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూ.3 వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు. ఇక వారి అనుబంధ మీడియా సంస్థలు మాత్రం రూ.200 కోట్ల వ్యవహారమని ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసలు ఈ మూడు అంకెలలో ఏది నిజమో, దేనికి కట్టుబడి ఉన్నారో ప్రతిపక్ష నేతలు ముందుగా క్లారిటీ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.

 

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

 

తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా పరిగణించారు. ఈ టెండర్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరిగినా, దాన్ని ప్రతిపక్షాలు నిరూపిస్తే తాను తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ విషయంలో చర్చకు తాను సిద్ధమని, వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరిగిందని ధీమా వ్యక్తం చేశారు.

 

సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలోనే టెండర్లు

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరిగాయని మంత్రి వివరించారు. టెండర్లన్నీ అధికారిక ‘ఈ-ప్రొక్యూర్‌మెంట్’ (e-Procurement) పోర్టల్ ద్వారానే నిర్వహించామని, ఇందులో దాచడానికి ఏమీ లేదన్నారు. ఈ ప్రక్రియ అంతా సీనియర్ ఐఏఎస్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 27 రకాల గురుకుల వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే టెండర్లు పిలిచినట్లు పూర్తి సమాచారంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో వివరించారు

ANN TOP 10