AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేశినేని సోదరులపై మళ్లీ చర్చ మొదలు..!

చాన్నాళ్ల తర్వాత సోదరుల మధ్య రచ్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించారు. ఒకరి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కాగా, మరొకరు కేశినేని నాని. ఇంతకీ సోదరుల మధ్య మళ్లీ ఏం జరిగింది? చిన్ని దూకుడు వెనుక అసలేం జరిగింది? తెరపైకి ఎలాంటి కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

 

కేశినేని సోదరులపై మళ్లీ చర్చ మొదలు

 

కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. రూ.120 కోట్ల మేరా బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, ఆటోవాహనదారులు రెండు వాయిదాలు చెల్లించకుంటే భూమి తీసుకుంటారని, ప్రజాధనం లూటీ చేసిన మాజీ ఎంపీ అప్పు గురించి బ్యాంకు అధికారులు ఎవరితో లాలూచీ పడ్డారని ప్రశ్నించారు.

 

కేశినేని నాని ఖాతాలో రూ.7 కోట్లు ఉన్నా ఎందుకు డెబిట్ చేయలేదని ప్రశ్నించారు. దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. మాజీ ఎంపీ ఇళ్లు, హోటళ్లు బ్యాంకు ఆధీనంలో ఉందన్నారు. రతన్ టాటాను ఆయన మోసం చేశారంటూ కొత్త విషయాలు తెరపైకి తెచ్చారు. బెంజ్ సర్కిల్ లో ఆయనకు సంబంధించి ఆస్తి తాకట్టు పెట్టారన్నారు.

 

Advertisement

నాని వ్యాఖ్యలపై చిన్న స్ట్రాంగ్ కౌంటర్, ఆపై కొత్త విషయాలు వెలుగులోకి

 

ఆయా ఆస్తులకు సంబంధించి ప్రతీనెలా అద్దె డబ్బులు, మాజీ ఎంపీ సొంత అకౌంట్ కు వెళ్తుందని ఆరోపించారు. తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు అందలేదన్నారు. న్యాయ వ్యవస్థలో లూప్ హోల్ అడ్డం పెట్టుకుని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.

 

తనపై పోటీ చేసిన అభ్యర్థుల్ని ఫ్రాడ్ అనటం కేశినేని నానికి అలవాటుగా మారిందని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్వీట్లకు తాను జవాబుదారీ కాదని, ప్రభుత్వానికి-విజయవాడ ప్రజలకు మాత్రమేనని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వస్తూ చిరంజీవి-పవన్ లను విమర్శించారని వివరించారు.

 

సాక్షి మీడియా, జగన్‌ను తప్ప అందరినీ విరమర్శించే నాని ఆంతర్యం ఏంటని సూటిగా ప్రశ్నించారు. జగన్ పంథాలోనే అరవడం నానికి అలవాటుగా మారిందన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న నానిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సరైన ఆధారాలతో వస్తే తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తానని ఎంపీ చిన్ని కుండబద్దలు కొట్టేశారు.

 

మాజీ ఎంపి కేశినేని నాని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఒక దిక్కుమాలిన కంపెనీకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కట్టబెడుతుంటే ప్రశ్నించినందుకు తన మీద 14 నెలల తర్వాత పోలీసు కేసు పెట్టారని రాసుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయటం వల్ల ఆ దొంగ కంపెనీకి భూమి కేటాయింపు నిలిచిపోయిందన్నారు.

 

డీల్ అడ్డం తిరిగి, వేల కోట్లు నష్ట పోయేసరికి ఫ్రస్ట్రేషన్లో తనపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని రాసుకొచ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో ఇలాంటి బెదిరింపులను ఎన్నో చూశానని తెలిపారు. నా లేఖతో ఆ స్కామ్‌లను ఆపినందుకు, ప్రజల సంపదను కాపాడగలిగినందుకు గర్వపడుతున్నానని ప్రస్తావించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

ANN TOP 10