AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు బిగ్ ప్లాన్.. ఏపీ రాజధాని పనులకు శ్రీకారం.. మోదీ శంఖుస్థాపన..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులకు మళ్లీ కొత్త ఊపు రానుంది. గతంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణ పనులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులతో శంకుస్థాపన చేయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

 

అమరావతి భవిష్యత్తు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే నెలలో, అంటే ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య ప్రధాని మోదీ అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. అధికారికంగా దృవీకరణ ఇంకా కాలేదు. కానీ ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలు అమరావతి భవిష్యత్తును మలుపుతిప్పే ఛాన్సుంది.

 

రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు

2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అప్పట్లో ప్రధాని మోదీ స్వయంగా రాజధాని పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగాయి. అయితే, 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రాజధాని పనులను పూర్తిగా ఆపేశారు.

 

మూడు రాజధానులు

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి పనులకు బ్రేక్ పడింది. ఆ క్రమంలో అమరావతి భూసేకరణ, నిర్మాణ పనులకు సంబంధించిన అనేక న్యాయ పరమైన సమస్యలు తలెత్తాయి.

 

టీడీపీ కూటమి కొత్త ప్లాన్

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ రుణాన్ని తిరిగి సక్రమంగా పొందడంలో చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించింది. రుణ మంజూరు అనంతరం, అమరావతి నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడానికి ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలవగా, అమరావతి పనులకు శంకుస్థాపన చేయాలని కోరినట్లు సమాచారం.

 

ఇంకా అధికారికంగా..

ప్రధాని కార్యాలయం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య ప్రధాని పర్యటన జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అమరావతిలో ప్రధాన రహదారులు, శంకుస్థాపన వేదిక నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయంటే, ఇది రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా మారనుంది. అమరావతి నిర్మాణం వేగంగా సాగితే, టీడీపీ ప్రభుత్వం ప్రజల మద్దతును మరింత బలోపేతం చేసుకోనుంది.

 

ప్రధాని మోదీ పాత్ర

ప్రధానమంత్రి మోదీ అమరావతి నిర్మాణానికి మద్దతు ఇవ్వడం వల్ల, ఆ పార్టీకి ఆంధ్రాలో రాజకీయంగా లాభం కలుగనుంది. బీజేపీకి దక్షిణ భారతదేశంలో మరింత ప్రాధాన్యం పెరగనుంది. అమరావతి నిర్మాణం ప్రారంభమైతే, వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను ప్రజలు మళ్లీ చర్చించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనేది చూడాలి మరి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10