AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు

మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి బుధవారం కమలం పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చెన్నమనేని వికాస్ రావు, ఆయన సతీమణి దీపా బీజేపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వికాస్ రావు వేములవాడ నుంచి బరిలో దిగనున్నారు.

వేములవాడలో ఏడాదిగా వికాస్ రావు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వికాస్ రావు తండ్రి విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ గా పని చేశారు. గతంలో మెట్ పల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బేజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ రావు పని చేశారు. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ ఉన్నారు.

అనంతరం చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ ఈరోజు బీజేపీలో చేరడం తన జీవితంలో మర్చిపోలేనిది.. ఇది భావోద్వేగ సంఘటనగా చెప్ప వచ్చన్నారు. బీజేపీకి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తాను చిన్నప్పటి నుండి సంఘ్ నుండి పెరిగానని తెలిపారు. చిన్నప్పుడే హేమా హేమీలు వాజపేయ్, అద్వానీ నీడలో పెరిగానని చెప్పారు. కిషన్ రెడ్డి తనకు స్ఫూర్తి ఇచ్చారని.. వారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం గర్వకారణంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో, మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, దీపాలను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీలో దశబ్ధాలుగా బలమైన కుటుంబం నుండి ఉన్నారని తెలిపారు. చెన్నమనేని వికాస్ రావు వేములవాడ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. వారి చేరిక పార్టీకి ఎంతో బలం చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10