హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో బడాబాబుల పిల్లలు కారు రేసింగ్తో రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కార్లు, బైకులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. మితిమీరిన వేగంతో రేసింగ్లకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల నగరంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరు మహిళలు బైక్ రేసర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా.. వారి తీరులో మాత్రం మార్పు రావటం లేదు.
తాజాగా.. ప్రకృతి అందానికి, ఆహ్లాదకర వాతావరణానికి నిలయమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో హైదరాబాద్కు చెందిన కొంతమంది యువకులు.. బైకులు, కార్ల రేసింగ్తో అలజడి సృష్టించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర రేసులు నిర్వహించి.. టూరిస్టులను భయపెట్టారు. కార్లు, బైకులతో స్టంట్లు చేస్తూ ప్రశాంతమైన అనంతగిరి కొండల్లో దుమ్మురేపారు.
అనంతగిరి కొండల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓ ఎస్ఐ, సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుంటారు. ఇండిపెండెన్స్ డే కావటంతో వీరు కూడా లేకపోవడంతో కుర్రకారు మరింత చెలరేగిపోయారు. విచ్చల విడిగా బైకులు, కార్లు నడుపుతూ నానా హంగామా చేశారు. పదుల సంఖ్యలో అక్కడకు చేరుకున్న యువత.. రేసింగ్లతో హడలెత్తించారు.