పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతే అని పార్లమెంట్లో కేంద్రం సంచలన ప్రకటన చేసింది. విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతిని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతి ఏర్పాటు అయ్యిందని తేల్చిచెప్పింది. దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదని కేంద్రం చెప్పకనే చెప్పింది.
బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వ కేంద్రాన్ని సంప్రదించలేదని… జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది.
అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది.