దీపావళి పండుగ వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో దీపావళి కానుక ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు మేలు చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థుల కాస్మోటిక్స్, డైట్ ఛార్జీలను భారీగా పెంచింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, కాలేజీలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్ల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వసతి గృహాల్లో ఉంటూ విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో హాస్టళ్లలో ఉంటున్న 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
అయితే.. ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న హాస్టల్ విద్యార్థులకు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను ఒక్కసారిగా రూ.1330కి ప్రభుత్వం పెంచింది. మరోవైపు.. 8 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హాస్టల్ విద్యార్థులకు రూ.1100గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1,540కి పెంచింది. ఇక.. ఇంటర్ నుంచి పీజీ వరకు ఉన్న హాస్టల్ విద్యార్థులకు రూ.1,500గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.2100కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.