మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపేందుకు ఇవాళ జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజకీయాలతో, పార్టీతో సంబంధం లేకుండా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా పంచుకోడానికి కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే కేసీఆర్, ఈ ఒక్క రోజు సెషన్కు మాత్రం హాజరై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్కు ఉన్న అభిప్రాయాన్ని, ఆయన తీసుకున్న చొరవ తదితరాలను సభా వేదికగా ప్రస్తావించే అవకాశమున్నది.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో (యూపీఏ 1) కేసీఆర్ రెండేండ్ల పాటు కేంద్రమంత్రిగా కేబినెట్లో కొనసాగారు. పదేండ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో లోక్ సభ ఎంపీగా పార్లమెంటులో కంటిన్యూ అయ్యారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న పలు నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పథకాలు విప్లవాత్మకమైనవంటూ గతంలోనే సీఎం హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ కొనియాడారు. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా గుర్తు చేసే అవకాశమున్నది. సభకు హాజరుకానున్నట్లు సన్నిహితుల ద్వారా ఎమ్మెల్యేలకు కూడా సంకేతాలు అందాయి.
మన్మోహన్ సింగ్ గురించి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రస్తావించే అంశాలను ఇతర పార్టీల సభ్యులు వ్యతిరేకించే అవకాశం లేనందున సభకు హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మన్మోహన్ మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ సంతాపం తెలియజేశారు. ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు కేసీఆర్ హాజరవుతారని చాలామంది రాజకీయ నాయకులు భావించినా బీఆర్ఎస్ ప్రతినిధిగా కేటీఆర్ను పంపించారు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్కు కూడా హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తుచేసే అవకాశమున్నది. తెలంగాణతో మన్మోహన్కు ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు సమాచారం.