కమిషన్ విచారణపై స్టేకు నిరాకరించిన హైకోర్టు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలలో రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తే తప్పేముందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ తదుపరి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది. కమిషన్ ఈ నెల 19న ఇచ్చిన నోటీసు ప్రకారం జూన్ 27వ తేదీకల్లా కేసీఆర్ ఆ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్నది. దీన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్ ఇచ్చిన గడువు తేదీని ఒక రోజు పొడిగించేలా చూడాలని, అప్పటివరకు స్టే విధించాలనీ కేసీఆర్ తరఫున హాజరైన న్యాయవాది ఆదిత్య సోంధి హైకోర్టును కోరారు. కానీ ఇందుకు హైకోర్టు నిరాకరించింది. జ్యుడిషియల్ ఎంక్వయిరీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగూ రిపోర్టు వస్తుందని, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించొచ్చు గదా అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కోరిన ఒక రోజు స్టేకు సమ్మతించని హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
చత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల నిర్ణయాల్లో జరిగిన లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ కు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ను వేశారు. ఈ పిటిషన్కు రిజిస్ట్రీ నంబరింగ్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ప్రత్యేకంగా కోరడంతో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరఫు న్యాయవాది వాదిస్తూ… ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేశామని, ఈఆర్సీ ఆమోదాలపై జ్యుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వెరీ చేయకూడదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నియమించిందని పేర్కొన్నారు.