కరీంనగర్ : పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాలన్నారు. పొంగులేటితో ఈటల బృందం భేటీ విషయమై తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవటం తప్పేమీ కాదన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు. తనకు తెలిసిన వారితో తాను.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు.
నేడు పొంగులేటిని కలవనున్న బీజేపీ చేరికల కమిటి కలవనుంది. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్కు నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటి బీజేపీలో చేరటం దాదాపు ఖాయమని అనుచరులు చెబుతున్నారు.