AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌తో అంబేడ్కర్‌కు ప్రత్యేక అనుబంధం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు హైదరాబాద్ నగరం, ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌ రాష్ర్టాన్ని భారత యూనియన్‌లో కలపాలని నిజాం నవాబును కోరిన వారిలో అంబేడ్కర్‌ ఒకరు. విలీనం ద్వారా జీవితకాలం రాజప్రముఖ్‌ గుర్తింపు లభిస్తుందని నిజాం రాజును అంబేడ్కర్ నచ్చజెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హైదరాబాద్ సంస్థాన్ని నిజాం నవాబు భారత యూనియన్‌లో కలిపారు. ఇక అంబేద్కర్‌ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లగా.. ఆయన ప్రయాణ, వసతి ఖర్చులను నిజాం ప్రభుత్వమే భరించింది.

అంబేడ్కర్ పలుమార్లు హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. 1932 సెప్టెంబర్‌ 3న తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగు పెట్టిన అంబేద్కర్‌.. నిజాం ప్రభుత్వ 72వ సమావేశంలో పాల్గొన్నారు. 1942లో మరోసారి, 1944లో నగరంలో ఎస్సీ ఫెడరేషన్‌ మహాసభలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఆ మహాసభలో అంబేడ్కర్ చారిత్రక ప్రసంగం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో అంబేడ్కర్‌ సికింద్రాబాద్‌కు వచ్చారు. పెండర్‌గాస్ట్‌ రోడ్డులో అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు జేహెచ్‌ సుబ్బయ్య ఇంటికి ఆయన వచ్చారు.

ఇక 1953లో అబేండ్కర్ చివరి సారిగా హైదరాబాద్‌కు రాగా..ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంబేడ్కర్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది ఉస్మానియా యూనివర్సిటీనే. ఇక దేశానికి రెండో రాజధాని గనుక ఉంటే అది హైదరాబాదే అయి ఉండాలని అంబేడ్కర్ సూచించారు. ఈ విషయాన్ని ‘థాట్స్‌ ఆన్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌’ అనే పుస్తకంలో అంబేడ్కర్ వెల్లడించారు. అతిపెద్ద కంటోన్మెంట్‌, ఢిల్లీకి తీసిపోని పెద్దపెద్ద భవనాలతో పాటు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండే హైదరాబాద్‌ను ఆయన ఎంతో ఇష్టపడేవారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయాలని ఆనాడు అంబేడ్కర్ సూచించారు. ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 కారణంగా నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10