AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్-విజయవాడ రూట్లో వెళ్లేవారికి గుడ్ న్యూస్

టీఎస్‌ఆర్టీసీ భారీ డిస్కౌంట్
ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్‌లో నడిచే సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్‌ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.

”విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల ౩౦ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలిపారు. రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.

ANN TOP 10