ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్ని మరింత హాట్ హాట్ గా మార్చారు. ముఖ్యంగా గులాబీ(బీఆర్ఎస్)లో గుబులు పుట్టించారనే చెప్పాలి. ఎందుకంటే మోడీ ప్రసంగంలో తెలంగాణలోని కేసీఆర్ సర్కారు పై ఆయన మూడు నిమిషాల పాటు విమర్శలు చేశారు. నిజానికి.. ఇదేమీ పెద్ద సమయం కూడా కాదు. అది కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఒకట్రెండు మాటలు కాస్తంత కటువుగా ఉన్నా.. మిగిలిన మాటలన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడినవే అన్న అభిప్రాయం కలిగేలా చేశాయి. కానీ.. ప్రధాని మోడీ విమర్శలకు గులాబీ దళం నుంచి మాత్రం రియాక్షన్ భారీగా వచ్చిందని చెప్పాలి. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఫాలో కాకుండా.. బీఆర్ఎస్ నేతల కౌంటర్లు చూస్తే మాత్రం.. ఏంటి ప్రధాని ఘాటైన వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలగక మానదు. వారిలో గుబులు రేపిందనడానికి వారి స్పందన తీరే తెలియజేస్తోంది.
కానీ.. ప్రధాని స్పీచ్ ను ఫాలో అయి.. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల స్పందనను చూస్తే.. మాత్రం ఆ మాత్రం దానికి మరీ ఇంతలా రియాక్టు కావాలా? అన్న సందేహం కలగక మానదు. మంత్రులు హరీశ్ రావు మొదలు కొని పలువురు మంత్రులు.. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తమ గళాన్ని విప్పిన తీరు.. సంధించిన విమర్శనాస్త్రాల్ని చూస్తే మాత్రం మరీ ఇంత భారీగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.
కొందరు మంత్రులు అయితే ఒకట్రెండు అడుగులు ముందుకేసీ.. తెలంగాణ ప్రయోజనాల మీదా.. మోడీ పర్యటన కారణంగా తెలంగాణకు ఒరిగిందేమిటన్న విషయాల్ని చెప్పే కన్నా.. అదానీ ఇష్యూను ప్రస్తావించటం విశేషం. అంతేకాదు..ప్రధానమంత్రి తన అధికారిక కార్యక్రమాల్లో పాటించాల్సిన విధానాల్ని పాటించకుండా పార్టీ కార్యక్రమం మాదిరి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు పలువురు మండిపడ్డారు.