ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, అక్రమాస్తుల కేసులో జగన్కు కోర్టులంటే లెక్కలేదని విమర్శించారు. జగన్ కోర్టుకు హాజరు కావడం లేదని, ఈ విషయంలో కోర్టు కూడా ఆయన్ను తప్పుపట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అలాగే, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చంద్రబాబు అన్నారు. పీపీపీ విధానమంటే ప్రభుత్వ పెత్తనమే ఉంటుందని, ప్రైవేట్ వ్యక్తులు వాటిని నడుపుతారని ఆయన వివరించారు. ఈ విధానం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని తెలిసినా, జగన్ మాత్రం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాలంటే పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కళాశాలలను నిర్వహించడం ఉత్తమమని, ఇది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ మోడల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా, తిరుమల పరకామణి చోరీ కేసు జగన్కు ఒక చిన్న విషయంగా కనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు.









