ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పింఛన్ల పథకాన్ని పునరుద్ధరించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 4,929 మంది లబ్ధిదారులకు తిరిగి ప్రయోజనం చేకూరనుంది.
రాజధాని కోసం భూసమీకరణ జరిగినప్పుడు, భూమి లేక ఉపాధి కోల్పోయిన పేదల కోసం ఈ పింఛన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నెలకు రూ. 5 వేల చొప్పున సాయం అందించేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పింఛన్లను రద్దు చేయగా, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతి అభివృద్ధి పనులతో పాటు ఈ పథకాన్ని కూడా తిరిగి ప్రారంభిస్తున్నారు.
ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పేదలు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో గానీ, గ్రామసభల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని వేలాది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.









