ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిరీక్షణ ముగిసింది. ఈ నెల 16వ తేదీన వారికి లాంఛనంగా నియామక పత్రాలు (Appointment Letters) అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబులతో కలిసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.









