ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు రావడం ఇది రెండోసారి. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మెస్సీ టూర్ షెడ్యూల్, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఈవెంట్పై దేశవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానుల దృష్టి నెలకొంది.
ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ నేరుగా చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. అక్కడ కేవలం 100 మందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సితో అభిమానులు ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఫోటోకు రూ. 10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతిరెడ్డి తెలిపారు.
కేవలం 100 మందికి మాత్రమే ఈ ఫోటో అవకాశం లభిస్తుంది, దీనికోసం ఇప్పటికే 60 మందికి పైగా అభిమానులు రిజిస్టర్ చేసుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అనంతరం మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. కోల్కతాలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉన్నారు.









