మెదక్ జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నర్సాపూర్ కాజీగల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కరిచాయి. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం పాపను హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోనూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. బజారులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ డిగ్రీ విద్యార్థినిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇక వారం రోజుల క్రితం.. సిద్దిపేట కలెక్టరేట్లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో పాటు మరో ఇద్దరిని కుక్కలు కరిచాయి. వీధి కుక్కల దాడిలో కలెక్టర్ పెంపుడు కుక్కకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట శివారులో కలెక్టరేట్తో పాటు అధికారుల నివాసాలు కూడా ఉంటాయి. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తాను ఉంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా.. వీధి కుక్కలు దాడి చేశాయి. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్రంగా గాయపరిచాయి.
నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన సగంతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొని జీహెచ్ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు.