రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు తాను హాజరుకావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ స్పష్టతనిచ్చారు. లోక్సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందని నేపథ్యంలో థరూర్ హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ, తన హాజరుకు గల కారణాన్ని మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
విందుకు హాజరుకావడానికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ, తాను విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా తన విధి నిర్వహణలో భాగంగానే వచ్చానని శశి థరూర్ తెలిపారు. “విదేశాలతో సంబంధాలు నెరపడం మా కమిటీ పరిధిలోని అంశం. ఆయా దేశాలతో చర్చల్లో ఏం జరుగుతుందో, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. అంతకుమించి ఇందులో మరేమీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు. విందుకు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో పార్టీ మారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు శశి థరూర్ ఆచితూచి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీని అని, ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో కొన్ని విషయాల్లో విభేదించినా, మరికొన్నింటిలో ఏకీభవిస్తూ ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడమే తన ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.









