సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-2 తేడాతో క్లీన్ స్వీప్కు గురైన నేపథ్యంలో, తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్ బహిరంగంగా స్పందించాడు. తాము మంచి క్రికెట్ ఆడలేదని అంగీకరిస్తూ, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. కచ్చితంగా పుంజుకుని, మరింత బలంగా తిరిగివస్తామని భారత జట్టు తరఫున హామీ ఇచ్చాడు.
పంత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, “గత రెండు వారాలుగా మేం సరైన ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. ఈసారి మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి. క్రీడలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మేం కష్టపడి, లోపాలను సరిదిద్దుకుని బలంగా పుంజుకుంటాం” అని పేర్కొన్నాడు. ఈ పరాజయం 2000 సంవత్సరం తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికాకు లభించిన రెండో టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.
రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడంతో, పంత్ ఆ మ్యాచ్కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కూడా పంత్ మాట్లాడుతూ, “ఈ ఫలితం తీవ్ర నిరాశపరిచింది. ప్రత్యర్థి జట్టు సిరీస్ను పూర్తిగా శాసించింది. ఒక జట్టుగా మేం అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది” అని ఓటమికి గల కారణాలను వివరించాడు.








