AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుట్టిన బిడ్డకు ‘రాధ’ అని నామకరణం: డీఎన్ఏ పరీక్ష కోరుతున్న అత్తమామలు

తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన ఆరోపణలపై జైలులో ఉన్న ముస్కాన్ రస్తోగి నవంబర్ 24న (సౌరభ్ పుట్టినరోజున) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆమె ఆ చిన్నారికి ‘రాధ’ అని పేరు పెట్టింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సౌరభ్ కుటుంబ సభ్యులు ఈ నవజాత శిశువుతో పాటు ముస్కాన్, సౌరభ్‌ల పెద్ద కూతురుకు కూడా డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఈ డీఎన్ఏ పరీక్ష డిమాండ్‌తో ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది.

లాజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చిన్నారి జన్మించిందని, ముస్కాన్‌ను బుధవారం తిరిగి జిల్లా జైలుకు పంపనున్నామని ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ షగున్ తెలిపారు. శిశువుకు ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లితో పాటు మహిళల బ్యారక్‌లో ఉండే అవకాశం ఉందని జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. ఈ విషయంలో చనిపోయిన సౌరభ్ రాజ్‌పుత్ సోదరుడు రాహుల్ స్పందిస్తూ, ఈ ఇద్దరు పిల్లలకు సౌరభ్‌తో జీవ సంబంధం ఉందని రుజువైతేనే రాజ్‌పుత్ కుటుంబం వారి బాధ్యత తీసుకుంటుందని, లేదంటే వారితో తమకు ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పారు.

సౌరభ్ కుటుంబ సభ్యులు డీఎన్ఏ పరీక్ష కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. రాహుల్ మాట్లాడుతూ, ముస్కాన్ అత్యంత తెలివైనదని, పిల్లల భద్రతకు కూడా ముప్పు కలిగించే అవకాశం ఉందని ఆరోపించారు. సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్ కూడా ఈ డిమాండ్‌ను పూర్తిగా సమర్థించారు. కాగా, సౌరభ్ పుట్టినరోజునే ప్రసవం కావాలని ముస్కాన్ ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక వేసుకుందన్న ఆరోపణలను ఆసుపత్రి అధికారులు ఖండించారు. ప్రసవ తేదీ కేవలం అంచనా మాత్రమేనని, ప్రసవ సమయాన్ని ఎవరూ ప్రణాళిక చేయలేరని డాక్టర్ షగున్ స్పష్టం చేశారు.

ANN TOP 10