భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సఫారీలు, భారత్ను ఘోర పరాజయం దిశగా నెట్టారు. తొలి ఇన్నింగ్స్లో మార్కో జాన్సెన్ (6-48) విజృంభణకు తోడు పేలవ బ్యాటింగ్తో టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా, భారత్పై దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, సెరులిన్ ముతుస్వామి (109), మార్కో జాన్సెన్ (93), కెప్టెన్ తెంబా బవుమా (41), ట్రిస్టన్ స్టబ్స్ (49)ల అద్భుత బ్యాటింగ్తో 389 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్లో యశస్వీ జైస్వాల్ (58) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఫాలో ఆన్ కూడా అందుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే, వాషింగ్టన్ సుందర్ (48), కుల్దీప్ యాదవ్ (19) ఎనిమిదో వికెట్కు 72 పరుగులు జోడించి పరువు కాపాడారు.
రెండో ఇన్నింగ్స్లో కూడా పర్యాటక జట్టు వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 314 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. నాల్గవ రోజు రెండో సెషన్లోపే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, టీమిండియా ముందు 400 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించాలని బవుమా జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్లో అద్భుతం జరిగితే తప్పా భారత్ ఓటమిని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.









