AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ సందేశం: ‘ప్రకటించిన నగదు అందకపోతే నిరాశవద్దు’

ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ప్రకటించిన నగదు బహుమతులు లేదా బ్రాండ్‌ల వాగ్దానాలు అన్నీ అందకపోతే దయచేసి నిరాశ చెందవద్దని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక కీలక సందేశం పంపారు. తమ ప్రమోషన్ కోసం జట్టు విజయాన్ని వాడుకునే సిగ్గులేని వారి గురించి పట్టించుకోవద్దని ఆయన సూచించారు. ఉచిత ప్రచారం పొందడం కోసం అనేక బ్రాండ్లు మరియు కొందరు వ్యక్తులు తప్పుడు ప్రకటనలు చేస్తారని, వారు క్రికెట్‌కు కీర్తిని తెచ్చిన వారికి ఏమీ ఇవ్వకుండా తమ బ్రాండ్లను ప్రచారం చేసుకుంటారని ఆయన తెలిపారు.

గవాస్కర్ ఈ సందర్భంగా 1983లో పురుషుల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు తమకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కూడా జట్టుకు చాలా వాగ్దానాలు చేశారని, కానీ వాటిలో దాదాపు ఏవీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో మీడియాను కూడా నిందించలేమని, ఎందుకంటే సిగ్గులేని వ్యక్తులు ఉచిత ప్రచారం పొందుతున్నారని గ్రహించకుండా వారు గొప్ప ప్రకటనలంటూ ప్రచారం చేశారని గవాస్కర్ అన్నారు.

దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన మహిళా జట్టుకు ఐసీసీ నుంచి దాదాపు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. అటు బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించగా, ఆయా రాష్ట్రాలు కూడా నజరానాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, హామీ ఇచ్చినట్లుగా నగదు అందకపోతే నిరుత్సాహానికి గురికాకుండా ఉండాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మహిళా జట్టుకు హెచ్చరికతో కూడిన సందేశాన్ని అందించారు.

 

ANN TOP 10