దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబీ29 (గ్లోబ్ట్రాటర్) కోసం భారత సినీ చరిత్రలోనే ఎన్నడూ చూడని స్థాయిలో ఓ భారీ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏకంగా 50,000 మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్ను కేవలం సినిమా వేడుకగా కాకుండా, ఒక చారిత్రక ఘట్టంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్తో పాటు, 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే ఈ సినిమా నుంచి విలన్ పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ను ‘కుంభ’ పేరుతో విడుదల చేయగా, దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. వీల్ చైర్లో కూర్చుని, నాలుగు రోబోటిక్ చేతులతో ఉన్న ఆయన లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమారన్ను తాను చూసిన అత్యుత్తమ నటులలో ఒకరిగా పేర్కొంటూ, క్రూరమైన విలన్ ‘కుంభ’ పాత్రకు ఆయన ప్రాణం పోయడం ఎంతో సంతృప్తినిచ్చిందని కొనియాడారు.
ఈ భారీ ప్రాజెక్ట్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె హైదరాబాద్ వీధుల వీడియోను షేర్ చేయగా, మహేశ్ బాబు దాన్ని రీషేర్ చేస్తూ స్వాగతం పలికారు. మరికొన్ని రోజుల్లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాల లుక్స్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన లేదా టీజర్ వెలువడుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









