దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. అంతేకాకుండా, అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. పంత్ ఇటీవల సౌతాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి, రెండో ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి కోల్కతాలో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది.
ఈ జట్టులో పంత్తో పాటు, యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చారు. వెన్నునొప్పి కారణంగా రిహాబిలిటేషన్కు వెళ్లిన ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 61.90 శాతం పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు కూడా జరగనున్నాయి.
ఇదే సమయంలో, సౌతాఫ్రికా-ఎ జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెప్టెన్గా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్లు నవంబర్ 13, 16, 19 తేదీల్లో రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతాయి.









