తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో మహిళల భద్రతకు సంబంధించిన ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రముఖ సంస్థ తమ మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న హాస్టల్ టాయిలెట్లో రహస్యంగా స్పై కెమెరాలను అమర్చినట్లు గుర్తించడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ హాస్టల్లో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగినియే ఈ కెమెరాలను అమర్చినట్లు తేలింది.
అదే హాస్టల్లో నివసిస్తున్న మరో మహిళకు నిందితురాలి కదలికలపై అనుమానం రావడంతో ఈ విషయం హాస్టల్ నిర్వాహకుల దృష్టికి వెళ్లింది. వారు చెక్ చేయగా, టాయిలెట్ లోపల కెమెరాలు దాచి ఉంచిన గుట్టు బయటపడింది. పోలీసులు వెంటనే స్పందించి నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలు రహస్యంగా రికార్డు చేసిన ఫుటేజీని తన ప్రియుడికి పంపాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ వీడియోలు ఎవరికీ షేర్ చేయబడకముందే ఆమె పట్టుబడింది.
ఈ విషయం తెలుసుకున్న హాస్టల్లో ఉంటున్న సుమారు 2 వేల మంది మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు ఇంకా ఏమైనా ఫుటేజీలు రికార్డు చేసిందా, ఈ నేరంలో ఇంకెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.









