శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ 174 బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో, దానిని మంగోలియాలోని ఉలన్బాటర్కు మళ్లించారు. ముందస్తు జాగ్రత్తగా ఈ విమానాన్ని ఉలన్బాటర్లో సురక్షితంగా దించినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.
ఈ విమానం శాన్ఫ్రాన్సిస్కో నుంచి మధ్యాహ్నం 2.47 గంటలకు బయలుదేరింది. వాస్తవానికి సోమవారం రాత్రి 9.59 గంటలకు కోల్కతా మీదుగా ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా ప్రయాణం మధ్యలో ఈ విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది.
విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు ఎయిరిండియా సంస్థ వెల్లడించింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు తదుపరి ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు ఎయిరిండియా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.









