గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Manik Rao Thackeray), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 8 నెలల పాటు అవిశ్రాంతంగా పని చేయాలని, ఇది చాలా కీలకమైన సమయమని అన్నారు. నాయకులు, వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా పని చేయాలని సూచించారు.
ప్రసార మాధ్యమాలలో మన వాదన బలంగా వినిపించేందుకు ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు.. ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. పని విభజన చేసామని.. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం చాలా కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, నదీమ్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.