జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, రౌడీ షీటర్గా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు మొత్తం 100 మంది రౌడీ షీటర్లను ముందస్తు జాగ్రత్త చర్యగా బైండోవర్ చేయడం జరిగింది. వీరిలో బోరబండ పోలీస్ స్టేషన్లోనే అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు ఉన్నారు.
బైండోవర్ అంటే చట్టపరమైన పరిభాషలో ‘సత్ప్రవర్తనకు హామీ’ అని అర్థం. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని లేదా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతారని పోలీసులు అనుమానించిన రౌడీ షీటర్లు, పాత నేరస్తులను స్థానిక తహసీల్దార్ లేదా ఆర్డీఓ (RDO) వంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడబోనని లిఖితపూర్వకంగా బాండ్ పేపర్పై హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్లు 107, 108, 109, 110 కింద నిర్వహిస్తారు.
బైండోవర్ అయిన వ్యక్తి సొంత పూచీకత్తుపై విడుదల చేయబడతాడు, అయితే వారు నిర్ణీత కాలం వరకు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత వారు మళ్లీ నేరానికి పాల్పడితే, వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి ఈ జాబితాలో ఉండటం ఉప ఎన్నికల వేళ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.









