AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్జేడీ కొత్త పథకం: ‘జీవికా CM స్కీమ్’ కింద మహిళలకు నెలకు రూ.30 వేలు

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల హంగామా వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల మనసులు గెలుచుకునేందుకు పోటీగా హామీలు ఇస్తున్నాయి. అధికార JDU-BJP ప్రభుత్వం ఇప్పటికే మహిళల అకౌంట్లలో స్వయం ఉపాధి ప్రోత్సాహం కింద రూ.10 వేలు జమ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల విశ్వాసాన్ని సాధించేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఆర్జేడీ (RJD) కూడా అదే దిశగా ముందుకెళ్తూ, మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

తాజాగా ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ ఒక కీలక హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన “జీవికా CM స్కీమ్” బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ‘జీవికా’ మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి, వారికి నెలకు రూ.30,000 జీతం చెల్లిస్తామని తేజస్వీ వెల్లడించారు. అలాగే, గతంలో మహిళలు స్వయం ఉపాధి కోసం తీసుకున్న లోన్లపై వడ్డీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. ఈ హామీలు గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు, దీంతో మహిళా ఓటర్లలో పెద్ద ఎత్తున ఆకర్షణ సృష్టిస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తేజస్వీ యాదవ్ ఈ హామీ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే హామీ ఇవ్వడం ద్వారా ఆయన ప్రభుత్వం వ్యతిరేక భావజాలాన్ని ఎదుర్కొనే వ్యూహం అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, బిహార్ ఆర్థిక స్థితి పరిమితంగా ఉండటం వల్ల, ఆర్థికంగా ఇంత పెద్ద స్కీమ్‌ను అమలు చేయడం సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయినప్పటికీ, తేజస్వీ ప్రకటించిన ఈ “జీవికా CM” పథకం ప్రస్తుత ఎన్నికల పోరులో కీలక చర్చా అంశంగా మారింది.

ANN TOP 10