AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు: 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించిన వెస్టిండీస్

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మంగళవారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో ఒక పూర్తిస్థాయి సభ్యదేశం ఇలా చేయడం ఇదే తొలిసారి. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని విండీస్ కెప్టెన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జట్టులోని ఐదుగురు స్పిన్నర్లు—అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియర్, గుడకేశ్ మోటీ, అలిక్ అథనేజ్—తలా 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు.

ఈ ఐదుగురు స్పిన్నర్ల దాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఒక దశలో 46 ఓవర్లకు కేవలం 163/7 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే, ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రిషద్ హొస్సేన్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని విధ్వంసం కారణంగా చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాదేశ్ ఏకంగా 50 పరుగులు రాబట్టగలిగింది. ఫలితంగా, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్ 89 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగా, అథానాజే, హోసేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్‌కు పూర్తిగా అనుకూలంగా ఉన్న ఈ కష్టతరమైన పిచ్‌పై విండీస్ ముందు 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఒక సవాలుగా మారింది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన బంగ్లాదేశ్, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో పైచేయి సాధించాలని చూస్తోంది.

ANN TOP 10