ప్రధాని రాకతో బీఆర్ఎస్, బీజేపీమధ్య పొలిటికల్ వార్
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, పొలిటికల్ వార్ పార్టీల మధ్యనే కాకుండా.. అధికారిక కేంద్రాల మధ్య కూడా నడుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు సహా, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ ఖరారైన విషయం తెలిసిందే. అయితే, ప్రధానిని పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ సీటు పక్కనే సీఎం కేసీఆర్కు సీటు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను పీఎంఓనే పర్యవేక్షిస్తుంటుంది. మరి.. సీఎం కేసీఆర్ రాను అని ప్రకటించినప్పటికీ పీఎంఓ ఆయన కోసం సీటు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే సీఎం గైర్హాజరుపై ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది. సీఎం కేసీఆర్ గైర్హాజరుపై తమకు సమాచారం లేదని అంటోంది పీఎంఓ. అందుకే ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు పీఎంఓ వర్గాలు. మరోవైపు.. అసలు ప్రధాని కార్యక్రమం గురించి తమతో ఎవరు మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు. అభివృద్ధి కార్యక్రమాలను సైతం బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారాయన. డెవలప్మెంట్ను, రాజకీయాన్ని మిక్స్ చేయవద్దని సూచించారు. హైదరాబాద్లో ప్రధాని కార్యక్రమానికి సంబంధించి తనకు పంపిన ఆహ్వానంలో ఎంపీల పేర్లు లేవని కేకే అన్నారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. సహకార సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో అయితే ప్రధాని కార్యక్రమం ఉంటుందో ఆ రాష్ట్ర సీఎంతో పీఎంఓ అధికారులు మాట్లాడతారని అన్నారు. కాని, ఇప్పుడా ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు కేకే.