దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU) క్యాంపస్లో దారుణం చోటుచేసుకుంది. ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి యత్నించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఓ ప్రదేశంలో ఈ ఘటన జరిగిందని, నిందితులు తన బట్టలు చించివేసి, అసభ్యంగా తాకుతూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందగా, మైదాన్ గర్హీ పోలీస్ స్టేషన్ బృందాలు వెంటనే వర్సిటీకి చేరుకున్నాయి. తొలుత మోలస్టేషన్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకున్న తర్వాత సామూహిక అత్యాచార యత్నం సెక్షన్లను కూడా జోడించారు. క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) దేశాల ఒప్పందం ద్వారా ఏర్పాటైన ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
ఈ దారుణ ఘటనతో క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ ఘటనతో క్యాంపస్లోని భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.