ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి కుదిరి, హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను విడుదల చేసింది. ఈ పరిణామాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
రెండేళ్లకు పైగా హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బందీల స్వేచ్ఛ సంబంధిత కుటుంబాల ధైర్యానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థిరమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దృఢ సంకల్పానికి గుర్తింపుగా నిలుస్తుందని మోదీ అన్నారు.
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్లు ఇటీవల కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలో 20 మంది బందీలను హమాస్ ఇజ్రాయెల్కు అప్పగించింది. త్వరలో 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను అప్పగించనుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.