AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కోల్డ్‌రిప్’ కల్తీ దగ్గు మందు కేసు… చెన్నైలో యజమాని అరెస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ దగ్గు మందు మరణాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 20 మంది చిన్నారుల మృతికి కారణమైన ఫార్మా కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ‘గోల్డ్‌ట్రిప్’ ఫార్మా కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం తెల్లవారుజామున కోడంబాక్కంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గుణ, శివపురి జిల్లాల్లో ‘కోల్డ్‌రిప్’ అనే దగ్గు మందును వాడిన తర్వాత సుమారు 20 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ సిరప్‌ను తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువార్ చత్రంలో ఉన్న ‘శ్రీసేన్ ఫార్మా’ అనే యూనిట్ తయారు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ల్యాబ్ పరీక్షల కోసం సిరప్ నమూనాలను పంపించారు. ఈ పరీక్షల్లో సిరప్‌లో ‘డైఇథిలిన్ గ్లైకాల్’ (డీఈజీ) అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా పెయింట్లు, ఇంకుల తయారీలో వాడే ఈ రసాయనం వల్ల చిన్నారుల్లో కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని మరణాలు సంభవించాయని అధికారులు నిర్ధారించారు.

 

జలుబు, దగ్గు కోసం వైద్యులు సూచించిన ఈ సిరప్ వాడిన కొన్ని రోజులకే చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది చిన్నారులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ విషాద ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘కోల్డ్‌రిప్’ సిరప్ అమ్మకాలు, పంపిణీపై నిషేధం విధించింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా ఈ మందు అమ్మకాలను నిలిపివేయాలని, అందుబాటులో ఉన్న స్టాక్‌ను స్వాధీనం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. తమిళనాడులో ఇంకా 2,000కు పైగా ‘కోల్డ్‌రిప్’ బాటిళ్లు మార్కెట్లో ఉండే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు.

 

కొన్ని రోజులుగా రంగనాథన్‌పై నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు, తమిళనాడు పోలీసుల సహకారంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మధ్యప్రదేశ్‌కు తరలించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కంపెనీ తయారీ నిబంధనలను ఉల్లంఘించిందా, భద్రతా ప్రమాణాలలో నిర్లక్ష్యం వహించిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ANN TOP 10