నగరంలో మరోసారి కూల్చివేతలు కలకలం సృష్టించాయి. దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే, శనివారం తెల్లవారుజామున, కొండాపూర్లోని బిక్షపతి నగర్లో హైడ్రా అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారనే కారణంతో అక్కడి ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే… శనివారం ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా అధికారులు బిక్షపతి నగర్కు చేరుకున్నారు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్ల సహాయంతో నిర్మాణాలను వేగంగా తొలగించడం మొదలుపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచే మీడియా ప్రతినిధులను, స్థానికులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
పండుగ పూట తమ నివాసాలను కూల్చివేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెద్ద భవనాలను వదిలేసి, తమలాంటి పేదల పూరి గుడిసెలు, రేకుల షెడ్లను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వారు వాపోతున్నారు. ఇటీవల బతుకమ్మ పండుగ తొలిరోజున గాజుల రామారంలోనూ ఇలాగే కూల్చివేతలు చేపట్టిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. వరుసగా పండుగల సమయంలోనే అధికారులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.