జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ-2 ద్వారా కిరాణా సామగ్రి, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, మందులు, ఆటోమొబైల్స్ వంటి 375 రకాల వస్తువుల ధరలు తగ్గాయి. గృహోపకరణాల నుంచి వాహనాలు, వ్యక్తిగత జీవిత మరియు ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం వరకు జీఎస్టీ సంస్కరణల ద్వారా ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల బిల్లుల్లో 13 శాతం వరకు భారం తగ్గుతుందని అంచనా. చిన్న కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ. 70 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ వర్గాల అంచనాల మేరకు దుస్తులు, పాదరక్షలు, స్టేషనరీ, మందులపై 7 నుండి 12 శాతం వరకు ఆదా అవుతుంది. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం వరకు ఆదా అవుతుంది. ట్రాక్టర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గడంతో రూ. 40 వేల వరకు, ద్విచక్ర వాహనాలపై రూ.2,800 నుండి రూ. 8,000 వరకు ధరలు తగ్గుతాయి.