AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమ‌ల లడ్డూ కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారి నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

 

వివరాల్లోకి వెళితే… తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. ఈ బృందంలోని దర్యాప్తు అధికారి వెంకట్రావు, విచారణలో భాగంగా చిన్నప్పన్న అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను సవాల్ చేస్తూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, సిట్‌లో వెంకట్రావు నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. అందువల్ల, ఆయన దర్యాప్తును కొనసాగించరాదని ఆదేశాలు జారీ చేసింది.

 

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు ఈ నెల 26న అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం, కేసును ఈ నెల‌ 26న విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? లేక కొట్టివేస్తుందా? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ANN TOP 10