విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాల వినియోగంపై ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్స్, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియంగా మార్చాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు శుక్రవారం ఓ లేఖ రాశారు.
ఈ మ్యూజియం ఏర్పాటుతో రాష్ట్రంలోని చిన్నారుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాఘవులు తన లేఖలో అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ప్రఖ్యాతిగాంచిన సైన్స్ మ్యూజియంలు ఉన్నాయని, విశాఖలో కూడా అలాంటిది ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలనే అంశంపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకునే ముందు తమ ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, నూతన రాజధాని అమరావతిలో కూడా భవిష్యత్తు తరాల విజ్ఞానం, వినోదం కోసం ఒక సైన్స్ మ్యూజియం, జంతు ప్రదర్శనశాల (జూ), బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు. ఈ నిర్మాణాలు రాజధాని అభివృద్ధికి మరింత దోహదపడతాయని రాఘవులు పేర్కొన్నారు.