వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో కట్టుకున్న భర్తే.. తన భార్య అయిన స్కూల్ టీచర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండ వేసి, నడిరోడ్డుపై ఊరేగించాడు. ఒడిశాలోని పూరీ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూరీ జిల్లా నీమాపడ ప్రాంతానికి చెందిన ఓ కాలేజీ లెక్చరర్కు, స్కూల్ టీచర్గా పనిచేస్తున్న మహిళకు గతంలో వివాహమైంది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భార్య ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో, తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందని భర్త అనుమానించాడు.
మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో, తన అనుచరులతో కలిసి భార్య ఉంటున్న ఇంటిపై దాడి చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఆమెతో పాటు మరో వ్యక్తి (అతను కూడా టీచర్) ఉండటాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరినీ బలవంతంగా బయటకు లాక్కొచ్చి దాడికి పాల్పడ్డాడు. భార్య మెడలో చెప్పుల దండ వేసి, జుట్టు పట్టుకుని ఈడ్చి, వీధుల్లో ఊరేగించాడు. ఆమె స్నేహితుడి బట్టలు విప్పించి, దాదాపు నగ్నంగా మార్చి అవమానించాడు.
చుట్టూ జనం చూస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా భర్త, అతని స్నేహితులు ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్ వైపు నడిపించారు. ఈ దారుణాన్ని అక్కడున్న కొందరు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. వీడియోలలో బాధితురాలు ఏడుస్తూ, వేడుకుంటున్నా భర్త ఆమెను కొడుతూ, తోస్తూ కనిపించడం అందరినీ కలిచివేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి గౌరవానికి భంగం కలిగించడం, అక్రమంగా దాడి చేయడం వంటి ఆరోపణలతో భర్తను, అతడి అనుచరుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.