భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సోమవారం విడుదల చేసింది.
ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం, ఆగస్టులో మొత్తం 20.01 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. జులై నెలలో నమోదైన 19.47 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే ఇది 2.8 శాతం అధికం. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వృద్ధి 34 శాతంగా ఉంది. ఇక లావాదేవీల విలువ పరంగా ఆగస్టులో రూ. 24.85 లక్షల కోట్లు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24 శాతం పెరుగుదల కావడం విశేషం. సగటున రోజుకు 645 మిలియన్ల లావాదేవీలు జరిగాయని ఎన్పీసీఐ తెలిపింది.
గత కొన్ని నెలలుగా యూపీఐ లావాదేవీలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్లో 18.40 బిలియన్ల లావాదేవీలు (విలువ రూ. 24.04 లక్షల కోట్లు) నమోదు కాగా, జులైలో అది 19.47 బిలియన్లకు (విలువ రూ. 25.08 లక్షల కోట్లు) చేరింది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఆగస్టు 2న ఒకే రోజు 700 మిలియన్ల లావాదేవీలతో మరో రికార్డును కూడా యూపీఐ సాధించింది.
ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. జులై నెలలో మొత్తం లావాదేవీల్లో మహారాష్ట్ర వాటా 9.8 శాతంగా ఉండగా, కర్ణాటక (5.5 శాతం), ఉత్తరప్రదేశ్ (5.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ముఖ్యంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు చేసే (పీ2ఎం) చెల్లింపులు గణనీయంగా పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. 2020 జూన్ లో మొత్తం లావాదేవీల్లో వీటి వాటా కేవలం 39 శాతంగా ఉండగా, ఈ ఏడాది జులై నాటికి అది 64 శాతానికి పెరిగింది. దేశంలో చలామణిలో ఉన్న నగదు (సీఐసీ) వృద్ధి కంటే యూపీఐ లావాదేవీల వృద్ధి చాలా వేగంగా ఉందని, ఇది ఆర్థిక సమ్మిళితత్వానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. కిరాణా సామాను, రుణాల వసూళ్లు వంటి విభాగాల్లో యూపీఐ వాడకం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.