ప్రపంచంలో కొన్ని దేశాలకు ఆర్థిక స్వార్థం పెరిగిపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై విధించిన టారిఫ్ లను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కొన్ని దేశాలకు ఆర్థిక స్వార్థం పెరిగిపోయిందని విమర్శించారు. అమెరికా టారిఫ్ ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, మన లక్ష్యాలను అందుకోవడానికి ముందుకు సాగడమే ప్రస్తుతం మన విధి అని పేర్కొన్నారు.
మన రైతుల శ్రేయస్సు విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గబోమని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్ ను మనమే ఏలాలని, ఆ దిశగా భారత్ ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ విషయంలో భారత్ ను ఏదీ అడ్డుకోలేదని పేర్కొన్నారు. చరిత్ర సృష్టించే సమయం వచ్చిందని వ్యాఖ్యానిస్తూ.. తక్కువ ధరకు అత్యధిక నాణ్యతే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ మార్కెట్ లో నాణ్యమైన వస్తుసేవలను అందుబాటులో ఉంచడం ద్వారా భారతదేశ శక్తిని ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఇతరులు చిన్నచూపు చూస్తున్నారనే విషయంపై మన శక్తినంతా వృధా చేసుకోవడం కాకుండా మనల్ని మనం బలంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలని ప్రధాని మోదీ సూచించారు.