ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఎర్రకోట బురుజుల నుంచి ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసి, తన పాత రికార్డును తానే అధిగమించారు. ఈసారి ఆయన ఏకధాటిగా 105 నిమిషాల పాటు ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ ఉదయం 7.33 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఉదయం 9.18 గంటలకు ముగించారు. మొత్తం మీద గంటా 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. గతేడాది (2024) 98 నిమిషాల పాటు ప్రసంగించి నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది మోదీ బద్దలు కొట్టారు.
ఈ ప్రసంగంతో మోదీ మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నారు. ఎర్రకోట నుంచి వరుసగా 12వ సారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన వ్యక్తిగా నిలిచారు. తద్వారా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును ఆయన అధిగమించారు. ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు వరుసగా ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ మాత్రమే ఆయన కంటే ముందున్నారు.
గతంలో కూడా మోదీ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. 2016లో 96 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2023లో 90 నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే, 2017లో కేవలం 56 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.
ఈ సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ విజయాలను సమగ్రంగా వివరించారు. ‘నయా భారత్’ నిర్మాణం, 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధనే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను దేశ ప్రజల ముందు ఉంచారు.