ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ధరాలీ గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది.
150 మంది సభ్యుల బృందం, ఎన్డీఆర్ఎఫ్తో కలిసి సహాయక చర్యలు చేపడుతోంది. ఒకవైపు తమ బృంద సభ్యులు గల్లంతైనప్పటికీ, నిరాటంకంగా సహాయక కార్యక్రమాలు సైన్యం కొనసాగిస్తోంది. అయితే ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.