దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి.
రైతులకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజా విడుదలతో అన్నదాతలకు వ్యవసాయ పనుల కోసం కీలకమైన పెట్టుబడి సాయం అందినట్లయింది.
ఈ పథకం కింద 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఆ సమయంలో బీహార్లోని భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో దాదాపు 9.8 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్లకు పైగా సాయాన్ని అందించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 19 విడతల్లో సుమారు 11 కోట్ల మంది రైతులకు రూ.3.46 లక్షల కోట్లకు పైగా ఆర్థిక చేయూత లభించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.