సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీ నారాయణ ఓ పాడ్ కాస్ట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గతంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన నుంచి బయటికి వచ్చి పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా పాడ్ కాస్ట్ లో ఆనాటి పరిణామాలను పంచుకున్నారు.
“నేను సినిమా రంగాన్ని వదిలేసి వచ్చాను… మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారు… మనం కలిసి పనిచేద్దాం… పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిద్దాం అని పవన్ కల్యాణ్ అనేవారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ విధానంతో 2019 ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు మాకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన (పవన్ కల్యాణ్) మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించారు. రాజకీయ పరిస్థితులు మార్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని చెప్పి, ఇప్పుడిలా సినిమాల్లోకి వెళ్లిపోతే పార్టీ సిద్ధాంతాలు బలహీనపడతాయని భావించాను. అందుకే నేను జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేశాను” అని వివరించారు.