అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టిసారించాలని సూచించారు. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు.
“మన దేశంలోని భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ.. భారతీయ ఉద్యోగులను నియమించుకొంటూ.. ఐర్లాండ్ను అడ్డంపెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. అమెరికన్ల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగాయి.
ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోసమే. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పని చేయాలి. మీరూ అదే చేయాలి. నేను కోరుకునేది కూడా అదే” అని ట్రంప్ అన్నారు.