భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది.
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు వైద్య సలహాను పాటించడానికి తాను తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్ఖడ్ రాజీనామా లేఖలో వెల్లడించారు. స్థిరమైన మద్దతు మరియు సహకారం అందించారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రివర్గ సభ్యులకు వారి అమూల్యమైన సహకారం మరియు మద్దతు పట్ల ధన్ఖడ్ ధన్యవాదాలు తెలిపారు.
తన పదవీ కాలంలో చాలా నేర్చుకున్నానని, పార్లమెంటు సభ్యుల నుంచి తనకు లభించిన ఆప్యాయత, నమ్మకం మరియు ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆయన అన్నారు. తన పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని చూసినందుకు ధన్ఖడ్ గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. “భారత్ ప్రపంచ ఖ్యాతి, అద్భుతమైన విజయాలతో నేను గర్వపడుతున్నాను. దేశం ఉజ్వల భవిష్యత్తుపై నాకు గట్టి నమ్మకం ఉంది” అని ఆయన తన వీడ్కోలు సందేశంలో తెలిపారు.
జగదీప్ ధన్ఖడ్ 2022 ఆగస్టు 11 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్గా సేవలు అందించారు. అంతకుముందు, ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రాజ్యసభ ఛైర్మన్గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలను కోరారు.