అధ్యాపక వృత్తికే కళంకం తెచ్చేలా ఇద్దరు అధ్యాపకులు వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ఓ విద్యార్థినిపై ఇద్దరు అధ్యాపకులు, మరో వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లా మూడుబిదిరెలోని ఓ కళాశాలకు చెందిన నరేంద్ర అనే అధ్యాపకుడు పాఠ్యాంశాల సందేహాలు తీర్చే నెపంతో ఓ విద్యార్థిని(19)తో తరచు ఫోన్లో మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నరేంద్ర, మరో అధ్యాపకుడు సందీప్ ఇటీవల కళాశాల పని మీద బెంగళూరు వెళ్తున్నామని చెప్పి ఆ విద్యార్థినిని నమ్మకంగా తీసుకువెళ్లారు.
ముగ్గురూ సందీప్ స్నేహితుడైన అనూప్ గదిలో దిగారు. సందీప్ గది బయటకు వెళ్లగా, నరేంద్ర ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వచ్చిన సందీప్.. తాను అంతా వీడియో తీశానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెప్పవద్దంటూ హెచ్చరించి వారు ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ సమయంలో అనూప్ రూమ్కు వచ్చి బెదిరించి అత్యాచారం చేశాడు.
అయితే, విషయం బయటకు చెబితే తమ కుటుంబ పరువు పోతుందని, అధ్యాపకులతో బెంగళూరు ఎందుకు వెళ్లావని తల్లిదండ్రులు మందలిస్తారని, తోటి విద్యార్థినులు అవహేళన చేస్తారన్న భయంతో బాధిత బాలిక ఈ విషయాన్ని పెద్దలకు చెప్పలేదు. జరిగిన గాయం నుంచి తేరుకుని ఇటీవల కళాశాలకు వెళ్తుండగా, మళ్లీ ఈ అధ్యాపకులు వేధింపులు మొదలు పెట్టారు.
దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కమిషన్ సూచనలతో మారతహళ్లి పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను నిన్న అరెస్టు చేశారు. సదరు అధ్యాపకులు గతంలోనూ కొందరిపై అత్యాచారాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.